కూకట్ పల్లి నవంబర్ 16, ప్రభ : నవంబర్ 16 వ తేది జాతీయ పత్రికాదినోత్సవం సందర్భంగా కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకయ్య జర్నలిస్ట్ సోదర,సోదరీమణులందరికీ శుభాకాంక్షలు తెలియచేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 16వ తేదిన జాతీయ పత్రికాదినోత్సవం జరుపుకుంటారు. 1956లో భారత తొలి ప్రెస్ కమిషన్ సిఫార్స్ మేరకు 1966 నవంబర్ 16 వ తేదిన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం నవంబర్ 16వ తేదిన జాతీయ పత్రికా (నేషనల్ ప్రెస్ డే) దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఒక దేశంలో ప్రజాస్వామ్యము సక్రమంగా పనిచేస్తున్నదీ లేనిదీ తెలుసుకోవాలంటే ఆ దేశములో పత్రికా రంగాన్ని పరిశీలిస్తే చాలు. పత్రికా రంగము మీద ఎటువంటి ఆంక్షలు లేకుండా పత్రికా స్వాతంత్ర్యము అమలవుతుంటే ఆ దేశంలో ప్రజాస్వామ్య పాలనకు, చట్టబద్ధపాలనకు డోకాలేనట్టే. ప్రెస్ కౌన్సిల్ పత్రికారంగాన్ని పరిశీలించటంతో పాటు వార్తల తీరుతెన్నులపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి వృత్తిపరమైన అక్రమాలకు పాల్పడిన పత్రికలు, సంస్థల చర్యలను విమర్శించటం, అభిశంసించటం, చర్యలకు సిఫార్సు చేస్తుంది. పత్రికా స్వేచ్ఛ కోసం పనిచేయాలన్నది లక్ష్యం. ప్రపంచంలో అనేక దేశాలలో ప్రెస్ కౌన్సిళ్లు ఉన్నాయి. అయితే మనదేశ కౌన్సిల్కు ఉన్న ప్రత్యేకత ఏమంటే ప్రభుత్వశాఖలపై కూడా తన అధికారాన్ని వినియోగించే అవకాశం కలిగి ఉంది. పత్రికలు, మీడియా స్వయంగా ఉన్నత ప్రమాణాలను నిర్ణయించుకొని అమలు జరిపే విధంగా ప్రెనౌకౌన్సిల్ ప్రోత్సహిస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రెస్ కౌన్సిల్ పత్రికా రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యల గురించి ప్రతి నవంబరు 16న సెమినార్లు నిర్వహిస్తున్నది. అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటనలోని 19 ఆర్టికల్కు అనుగుణంగా పాలకులు పత్రికా స్వేచ్ఛను కాపాడాలని, వారికి పత్రికా స్వేచ్ఛ ప్రాధాన్యతను గుర్తు చేస్తూ ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ దినంగా మే 3వ తేదీని ప్రకటించిందన్నారు.ఈ కార్యక్రమంలో కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ కోశాధికారి పుట్టి నగేష్, జాయింట్ సెక్రెటరీ నాగుల అంజిబాబు నేత,అడ్వైజర్ కిషోర్ చారి,మీడియా కన్వీనర్ దుర్గాప్రసాద్,ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం. లక్ష్మి, ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ రవీందర్ రెడ్డి,యస్. చంద్రశేఖర్, జి.శ్రీధర్, వీనిల్ గౌడ్, ప్రభాకర్ రెడ్డి, సభ్యులు వీర శేఖర్ రెడ్డి, బి.శ్రీధర్,బాబీ కాంత్, చంద్రకాంత్, అనిల్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.


